వాస్తవం ప్రతినిధి:రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి .నేటి నుంచి నెల రోజు పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సభ తరపున, తన తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. పరిపాలనా అనుభవం ఉన్న దేశంలోని దీర్ఘ కాల నాయకులలో మల్లికార్జున్ ఖర్గే ఒకరు అని వెంకయ్య పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం నబీ ఆజాద్ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా ఇటీవల కాలం వరకు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఆజాద్ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆజాద్ స్థానంలో ఖర్గే పేరును కాంగ్రెస్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. వాటిల్లో ముఖ్యంగా పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు కూడా ఉన్నాయి. త్వరలో దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడీవేడీగా కొనసాగే అవకాశం ఉంది.