వాస్తవం ప్రతినిధి: భారత తొలి మహిళా ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 103వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ నేతలు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, ముఖ్య నాయకులు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇందిరా గాంధీకి నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని శక్తిస్థల్లో ఉన్న ఇందిరాగాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. అధికారానికి ప్రతిరూపమైన ఆమె సమర్థవంతమైన ప్రధానమంత్రి. ఆమె నాయకత్వ పటిమ గురించి దేశం మొత్తం ఇప్పటికీ మాట్లాడుతున్నది. నానమ్మగా తనను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆమె నేర్పించిన విషయాలు తనను ప్రతిరోజూ ప్రేరేపిస్తాయని’ ట్వీట్ చేశారు.