వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ లో నూ కరోనా మెల్లిమెల్లిగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రాణాంతక వైరస్ నివారణలో ప్రజల సహకారం అంతగా లభించడంలేదు. లాక్డౌన్ను లెక్క చేయకుండా, సామాజిక దూరం పాటించకుండా చికెన్, మటన్ షాపుల ముందు ప్రజలు ఎగబడుతున్నారు. నాన్ వెజ్ దుకాణాల ముందు ఈ పరిస్థితి కనపడుతోంది.
ఒకరిని ఒకరు తాకుతూ, కరోనా వ్యాప్తిని లెక్క చేయకుండా వారు చికెన్ షాపుల వద్ద క్యూలో నిలబడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్ని రోజుల ముందు చికెన్ అంటేనే భయపడిపోయిన జనం.. చికెన్ తింటే కరోనా రాదని తెలుసుకుని మళ్లీ కొనుగోళ్లు మొదలు పెడుతున్నారు. కొన్ని దుకాణాల ముందు గుంపులు గుంపులుగా మాంసాహార ప్రియులు కనపడుతున్నారు.
లాక్ డౌన్ వేళ జనాలు కనీస నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగడంపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. నిత్యవసరాల కోసం ఏపీలో జనం భారీగా ఎగబడడంపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రస్తుతం లాక్ డౌన్ వేళ ఏడు గంటల పాటు నిబంధనలు సడలించి జనాలను బయటకు అనుమతిస్తున్నారు. కానీ జనం దూరం పాటించకుండా కొనుగోళ్లకు గుంపులుగా ఎగబడుతున్నారు. దీని వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండడంతో ఏపీ సర్కారు అలెర్ట్ అయ్యింది. రేపటి నుంచి కేవలం 4 గంటలు మాత్రమే నిత్యావసరాల కోసం జనాన్ని అనుమతించాలని డిసైడ్ అయ్యింది.
ఏపీలో లాక్ డౌన్ వేళ ఇక రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి అనుమతించాలని నిర్ణయించింది. ఇన్నాళ్లు మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న పరిమితిని ఇప్పుడు కుదించారు. ప్రజలు గుంపులుగా వెళుతున్న ఈ సమయంలో ఇలా కఠిన చర్యలు తీసుకోకపోతే కరోనా మరింత వ్యాపించడం ఖాయమని ఇలా నిబంధనలు కఠినతరం చేసింది.