వాస్తవం ప్రతినిధి: హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాద కరం అని ఈ ప్రయాణాలను పోత్సహించకూడదు అని ప్రతి ప్రభుత్వం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ప్రభుత్వ ప్రతినిధే ఈ సూచనలను పాటించకుండా వ్యవహరించడం తో కోర్టు నోటీసులు జారీ చేసింది. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ ఇటీవల ఓ హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో అక్కడ హెల్మట్ లేకుండానే ఆయన బైక్ను నడిపారు. పుడుకొట్టయ్లో జరిగిన క్యాంపుకు హాజరైన మంత్రి .. బైక్పై వచ్చారు. మంత్రితో పాటు మరో 100 మంది కూడా మోటర్సైకిళ్లపై ర్యాలీలో తీశారు. వాళ్లు కూడా హెల్మట్ ధరించలేదు. దీనితో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి.. మంత్రితో పాటు ఆ వేడుకకు హాజరైన వారిపై పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన మద్రాసు హైకోర్టు.. ఆరోగ్య శాఖ మంత్రికి నోటీసులు జారీ చేయడం తో విజయ భాస్కర్ చిక్కుల్లో పడ్డారు.